పోయిన ఆదివారం పొద్దు పోక పుస్తకాల అర నుండి ఆచార్య యన్ గోపి గారి “కాలాన్ని నిద్రపోనివ్వను” తీశాను. “తంగేడు పూలు” కవితా సంపుటి తో మొదలైన గోపి గారి సాహిత్య ప్రయాణం “చిత్ర దీపాలు” చేత పట్టుకుని “వంతెన” మీదుగా సాగి సాహిత్య అకాడెమీ అవార్డ్ అనే “మైలు రాయి” దాటింది. ఆయన అలోచనల్నే కాదు కాలాన్ని కూడా నిద్ర పోనివ్వనని ప్రతిజ్ఞ చేసి రాసినట్టున్నారు ఈ పుస్తకం.
మనలో చాలా మంది అనుకునేలానే చచ్చిపోతున్న ఉత్తరం గురించి అక్కడ ఇలా ఉంది.
“ఫోన్లలో ఏముంది హృదయ నిశ్శబ్ధం తప్ప
నిన్నూ నన్నూ ఉద్వేగ రేఖపై నిలిపిన ఈ ముత్యాల వంతెనను ఎవరు కూల్చేశారు ప్రియా”
ఆసక్తి రెట్టింపవగా స్థిమితం గా చదవటం మొదలెట్టాను.
జీవితం లో ఎదగాలని అందరికీ ఉంటుంది కానీ “నిచ్చెనలో ఏ మెట్టూ సుఖం గా ఉండదు” అని మరోసారి గుర్తు చేశారు.
ఎన్నాళ్ళో కలిసి ఉంటుంటాం కానీ మనం నిజంగా మనస్ఫూర్తిగా మాట్లాడుకుంటున్నామా?
“మనుషుల మధ్య ప్రవహించే ఎడారుల గురించే బాధ”
కవిత్వం నిజంగా అంతా విస్తృతమా అనిపించేలా
“పద్యాల్లో పట్టనంత పెద్ద ప్రపంచం ఉంటుందా
జీవితం ఇరుకైనప్పుడు మైదానాల్ని మరింత విశాలం చేసేదే కవిత్వం” అని భరోసా ఇచ్చి,
“నీ అహం నా సహనం పై బరువును మోపుతుంది” అని పాత విషయమే ఐనా సరికొత్త సమీకరణం లో చెప్పారు.
“కన్నీళ్ళు బాల్యం వైపు పరిగెడతాయి
ఎండుటాకులకు కూడా పచ్చని జ్ఞాపకాలుంటాయి”
చిన్ననాటి రోజులు గుర్తొస్తే మనందరికీ ఇలాగే అనిపిస్తుంది కదూ..
మూర్తీభవించిన ఏకాంతాన్ని కదిలించటం ఎలా?
“గాలిని ముక్కలుగా కోసే గడ్డిపోచలు ఘనీభవించిన ఏకాంతాన్ని కరిగిస్తాయి”
వెన్నెల ఏ కవిని మాత్రం ఆకర్షించలేదు?
“చంద్రుడ్ని ఎన్ని సార్లు రుద్దినా అరిగిపోడు వెన్నెల గంధం వస్తూనే ఉంటుంది” అని ఈయన చంద్రుణ్ణి గంధపు చెక్కగా మార్చేశారు.
అత్యద్భుతమైన క్షణాల్లో మాటలు మాత్రం ఒక్కోసారి మెదలకుంటాయి.. భావావేశం ఏదైనా కానీ..
“అపూర్వ సంగమాలు అనివార్య వియోగాలు ఏవీ తిరిగి చేతికందవు
చచ్చుబడి పోయిన మాటల్ని గురించే బాధ”
విషాదాల్లోకెల్లా విషాదం ఆప్తుల మరణం. అది కూడ ఈయన కవితకి అనుభవం.
“తనకి తెలియదు. తన మరణం క్షణమైతే మా మరణం క్షణక్షణమని”.
“వర్షమంటే నాకు మేఘాల తాళపత్రాలపై లిఖిస్తున్న మహా గ్రంధం లా ఉంటుంది”
ఇంకోచోట వర్షం గురించి ఇలా గంభీరం గా అనేసి,
ఇదంతా ఎందుకు రాస్తున్నారంటే “కలతగా ఉంది, కవిత్వం సోకినట్టుంది” అని సంజాయిషీ కూడా ఇచ్చుకున్నారు.
-స్వాతికుమారి (http://swathikumari.wordpress.com)
తొలి ప్రచురణ పొద్దు లో